న్యూఢిల్లీ,నవంబర్ 4 : బంగారం నిల్వల్లో మన దేశం 10వ స్థానంలో ఉంది. వినియోగంలో మాత్రం అతి పెద్ద దేశంగా భారత్ అవతరించింది. రెండు రోజుల క్రితం ఐఎంఎఫ్ నుంచి ఆర్బిఐ 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినప్పటికీ మన దేశం బంగారం నిల్వల్లో 10వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో చాలా దేశాలు బంగారం రూపంలో సంపదను కూడబెడుతున్నాయి.
ప్రస్తుతం మన దేశంలో 358 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మొత్తం మన సంపదలో ఇది 3.7 శాతం మాత్రమే. ఇప్పుడు ఆర్బిఐ కొనుగోలు చేసిన 200 టన్నులతో బంగారం నిల్వలు 558 టన్నులకు పెరుగుతాయి. దీనితో మొత్తం సంపదలో బంగారం వాటా 6 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం మన విదేశీ మారక నిల్వలు 285 బిలియన్ డాలర్లు. ఇందులో విదేశీ కరెన్సీ నిల్వలు 90 శాతం అంటే 268.3 బిలియన్ డాలర్లు ఉంది. మిగిలినది 10.3 బిలియన్ డాలర్ల విలువైన బంగారం రూపంలో ఉన్నాయి.
డాలర్ విలువ తరచు కరెక్షన్కు గురికావడం వల్ల చాలా దేశాలు తమ నిల్వలను బంగారం రూపంలోకి మార్చుకుంటున్నాయి. ఈ దారిలో ఇప్పటికే చైనా, రష్యా, బ్రెజిల్ నడుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ బంగారం కొనుగోలు చేయడంపై స్పందించిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ డాలర్ కంటే బంగారమే బెటర్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా కాలం క్రితమే రిజర్వ్ బ్యాంక్ బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు అనుమతి అడిగిందని ఆయన చెప్పారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమర్ధవంతంగా వినియోగించడంలో భాగంగానే బంగారన్ని భారీగా కొనుగోలు చేసినట్లు ఆర్బిఐ తెలిపింది. ఐఎంఎఫ్ నుంచి ఔన్స్కు 1,045 డాలర్ల చొప్పున 200 టన్నుల బంగారాన్ని 6.7 బిలియన్ డాలర్లకు ఆర్బిఐ కొనుగోలు చేసింది.