14 మంది సాక్షులను పేర్కొన్న పోలీసులు, అరెస్ట్కు రంగం సిద్ధం విజయవాడ,నవంబరు 4, ప్రభాతవార్త : మహిళా క్రికెటర్లపై అసభ్యంగా ప్రవర్తించినట్లుగా మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడైన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి వంకిన చాముండేశ్వరీనాథ్పై ఎట్టకేలకు పోలీసులు బుధవారం మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేశారు. 2009 జూన్ 26న తనను లైంగికంగా వేధించా రంటూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో అప్పట్లో కార్యదర్శిగా పనిచేస్తున్న చాముండేశ్వరీనాథ్పై విజయవాడకు చెందిన దుర్గాభవాని మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు తొలుత అసభ్యంగా దూషించడం(509ఐ.పి.సి.) క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు, దుర్గా భవానితో పాటు మరి కొంత మంది మహిళా క్రికెట ర్లు రాష్ట్ర హోంమంత్రిని కలిసిన నేపథ్యంలో,మరి కొంత మంది సాక్షులను విచారించినట్లుగా పేర్కొని, చాముండేశ్వరీనాథ్పై అసభ్యప్రవర్తన (354ఐ.పి. సి.) క్రింద కేసును మార్పు చేశారు.
అయితే కేసు ఎప్పుడో నమోదు చేసినప్పటికి చాముండేశ్వరీనాథ్ను అరెస్ట్ చేయడంలో పోలీసు లు అలసత్వం చూపారు. ఈ నేపథ్యంలో చాముం డేశ్వరీనాథ్ తనను అరెస్ట్ చేయరాదంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటీషన్ను గతంలో దాఖ లు చేశారు. దానిలో చాముండేశ్వరీనాథ్ను అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తొలుత ఫిిర్యాదు చేసిన దుర్గాభవాని చాముండేశ్వరీనాథ్తో రాజీ పడింది.
అయితే ఈ కేసులో మిగిలిన సాక్షులయిన, బాధితురాళ్ళెన తిరుపతికి చెందిన మౌనికా సాయి, భీమవరానికి చెందిన ఎస్.రమాదేవిలు తాము చా ముండేశ్వరీనాథ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తామని, కావున తమను సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద వాం గ్మూలాన్ని నమోదు చేయించే నిమిత్తం హాజరుపర్చ వల్సిందిగా ఉత్తర్వులు దర్యాప్తు అధికారి అయిన ఎ.సి.పి.కి జారీ చేయాల్సిందిగా కోరుతూ దర్యాప్తు అధికారి ఎ.సి.పి.వద్ద వినతిపత్రాన్ని సమర్పించా రు. అనంతరం నగర మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోను, మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులోను ఈ మేరకు పిటీషన్ను దాఖలు చేశారు.
అయితే గత నెల 21న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చాముండేశ్వరీనాథ్ దాఖలు చేసిన పిటీషన్పై తుది ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం రెండు వారాలలోపు పోలీసులను దర్యాప్తును ము గించమని, ఛార్జిషీటును దాఖలు చేసే వరకు చా ముండిని అరెస్ట్ చేయవద్దని పేర్కొంది.ఆ ఉత్తర్వుల ప్రకారం బుధవారంతో గడువు ముగియడంతో ఎ.సి.పి.సుబ్బారావు హడావుడిగా కోర్టులో ఛార్జిషీ టును దాఖలు చేశారు. ఇందులో 14 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. లైంగిక వేధింపుల క్రింద ఛార్జిషీటును దాఖలు చేసినట్లు ఆయన ప్రభాత వార్తకు వెల్లడించారు.అంతేకాక ఇక చాముండీ అరెస్టు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మౌనిక, రమాదేవిలను మెజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు : ఎ.సి.పి. ఛార్జిషీటును దాఖలు చేసిన నేపథ్యంలో 'ప్రభాతవార్త ఎ.సి.పి.ని సంప్రదించింది. ఇప్పటికే మిగిలిన భాధితురాలైన మౌనికా సాయి,రమాదేవిలు తమ వాంగ్మూలాలను రికార్డు చేయించే నిమిత్తం సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద తమను ప్రవేశపెట్టడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోర్టులో పిటీషన్ వేసిన విషయం గురించి ప్రశ్నించింది. దాంతో ఎ.సి.పి.సుబ్బారావు ప్రభాతవార్తతో మాట్లాడుతూ మౌనికా సాయి,రమాదేవిలను తాము అంతకు ముందే విచారించామని, వారిని మరల మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చి (164 సి.ఆర్.పి.సి.క్రింద) వాంగ్మూలాలను తీసుకోవల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ కేసులో ప్రస్తుతం చాముండితో రాజీపడిన దుర్గాభవానినే మొదటి సాక్షిగా ఛార్జిషీటులో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జిషీటు ప్రస్తుతం న్యాయమూర్తి పరిశీలనలో ఉంది. వీటిలో ఒక వేళ సాంకేతిక లోపాలుంటే న్యాయమూర్తి సదరు ఛార్జిషీటును సాంకేతిక లోపాలను సవరించి తిరిగి దాఖలు చేయమని రిటర్న్ చేసే అవకాశం ఉంది.