|
ముంబయి నవంబర్ 3:- సిమెంటు ధరలో ప్రస్తుతం 60 శాతం పన్నులే ఉండటం వల్ల వినియోగదారులు అధిక ధర చెల్లిస్తున్నారని అందువల్ల ఈ పన్నులను 20 శాతానికి తగ్గించాలని సిమెంటు ఉత్పత్తిదారుల సంఘం కోరుతున్నది. ఇటీవలనే ఈ సంఘానికి వినితా సింగానియా అనే ఆమె అధ్యక్షురాలిగా ఎంపిక అయింది.
ఇమె జెకె లక్ష్మి సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. పన్నులను ప్రభుత్వం తగ్గిస్తే సామాన్య ప్రజలు కూడా సిమెంటు వినియోగాన్ని పెంచుకోగలరన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇండియాలో ఈ పన్నులు మొత్తం ఆసియా, పిసిఫిక్ ప్రాంతంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 20 శాతం పన్నులతో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, వాల్యూ ఆడెడ్ టాక్స్ను హేతుబద్ధం చేయాలని, సిమెంటును కీలక పరిశ్రమగా గుర్తించి ఉక్కు, సున్నపురాయిల మీద సమానంగా రాయల్టీ వసూలు చేయాలని అసోసియేషన్ కోరుతున్నది. అలాగే సిమెంటు పరిశ్రమకు బొగ్గును ప్రాధాన్యత రంగంగా గుర్తించి కేటాయించాలని, సిమెంటు రంగం బొగ్గు కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో తలసరి సిమెంటు వినియోగం 356 కేజీలు ఉంటే ఇండియాలో తలసరి వినియోగం 156 కేజీలు మాత్రమే ఉన్నది. దీనిని పెంచాల్సిన అవసరం చాలా ఉన్నదని సిమెంటు ఉత్పత్తిదారుల సంఘం భావిస్తున్నది. ఇందుకోసం రోడ్లను కాంక్రీట్ రోడ్లుగా మార్చాలని సిఎమ్ఎ కోరుతున్నది. అలాగే ఫ్ల§్ు ఆష్ లభ్యత, రైల్వే వేగన్ల లభ్యత దిగుమతి చేసుకున్న సిమెంటుపై దిగుమతి సుంకం మళ్ళీ విధించడం వంటి అంశాలను సిఎమ్ఎ ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నది.
ప్రణాళిక సంఘం వర్కింగ్ గ్రూపు సిమెంటు పరిశ్రమకు 11వ ప్రణాళికలో (2007-12) కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. ఆ లక్ష్యాలను అందుకోవడమేకాకుండా అధిగమించగలమని సిఎమ్ఎ అభిప్రాయపడుతున్నది. 11వ ప్రణాళిక ముగిసేనాటికి ఇండియాలో 269 మిలియన్ టన్నుల సిమెంటుకు గిరాకీ ఉంటుందని అంచనా. 2007 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఇండియాలో 167 మిలియన్ టన్నుల సిమెంటు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. 2012 నాటికి 300 మిలియన్ టన్నుల సిమెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న రెండు సంవత్సరాలలో సిమెంటు మిగులు ఉండవచ్చునని, తర్వాత ఉత్పత్తి చేసిన సిమెంటుకు, గిరాకీకి మధ్య సమతుల్యత ఏర్పడుతుందని సిఎమ్ఎ భావిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెల వరకు సిమెంటు వినియోగం 12 శాతం పెరిగింది.
ఇటీవలి కాలంలో సిమెంటు కంపెనీలు సొంత అవసరాల కోసం విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల మీద ఇతరుల మీద ఆధారపడకుండా విద్యుత్ను ఉత్పత్తి చేయడమేకాకుండా అదనపు విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి సిమెంటు కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. సిమెంటు రంగానికి నాణ్యమైన విద్యుత్ చాలా అవసరం ఉంటుంది. చాలా సిమెంటు కంపెనీలు తమ మిగులు విద్యుత్ను ఇతరులకు విక్రయిస్తున్నాయి. సిమెంటు రంగంలో గుత్తాధిపత్య ధోరణలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తున్నది. సిమెంటు ధరలు అతిగా పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒత్తిడి చేస్తున్నది. ఆ ఒత్తిడికి అనుగుణంగా కంపెనీలు ధరలు తగ్గించి మళ్ళీ పెంచుతున్నాయి. ఒక్కోసారి సిమెంటు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు మార్కెట్లో నిల్వలు పేరుకుపోయి ధరలు తగ్గుతున్నాయి. అలాగే గిరాకీ పెరిగినప్పుడు కూడా ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ ధరలను మార్కెట్ షిప్టులు నిర్ణయించినా ప్రజల్లో మాత్రం సిమెంటు ఉత్పత్తిదారుల సంఘం సిమెంటు ధరలను ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయం బాగా బలపడిపోయింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఉత్పత్తి వ్యయం మీద ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తే మరికొన్ని సందర్భాల్లో రీటైల్ అమ్మకపు ధర మీద ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నాయి. 2007 నుంచి ప్రభుత్వం సిమెంటు దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేసింది. ఇండియాలో సిమెంటు వినియోగం అవసరాల మేరకు సిమెంటు ఉత్పత్తి కావడం లేదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నది. కాని ఇప్పుడు అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతున్నది. ఇండియాలో స్థానికంగా నాణ్యమైన బొగ్గు లభించకపోవడంతో సిమెంటు పరిశ్రమ దిగుమతి చేసుకున్న బొగ్గు మీద, పెట్కోక్ మీద ఆధారపడి ఉంటుంది. సిమెంటు దిగుమతి మీద ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం సిమెంటు వినియోగంలో ఉపయోగించే బొగ్గు మీద మాత్రం ఐదు శాతం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నది. ఈ ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించాలని సిమెంటు కంపెనీలు కోరుతున్నాయి. తుది ఉత్పత్తి మీద విధించిన ఎక్సైజ్ సుంకాన్ని కంటే ఈ ఉత్పత్తిని తయారు చేయడానికి ఉపయోగించే ఇతర ముడి పదార్థాల మీద సుంకం తక్కువగా ఉండాలన్నదని పన్నుల విధింపులో ప్రాథమిక సూత్రం. ఈ ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేయాలని సిమెంటు ఉత్పత్తిదారులు కోరుతున్నారు.
|