న్యూఢిల్లీ, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డి తివారీకి ఢిల్లీ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆయనపై దాఖలైన కేసును నేడు కొట్టివేసింది. తివారీ తన జన్మకు కారణమైన తండ్రి అనీ, ఈ విషయాన్ని ఆయన సమాజం ముందు ఒప్పుకోవాలనీ సుమారు రెండేళ్ల క్రితం ఒక యువకుడు కేసు దాఖలు చేసి సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. అయితే తివారీ మాత్రం ఆ అబ్బాయిని తన కుమారుడిగా అంగీక రించడానికి నిరాకరించడమే గాక తనను అప్ర తిష్టపాలు చేసేందుకు దాఖలు చేసిన ఈ కేసును కొట్టి వేయాలని కోర్టును అభ్యర్థించారు.
84 ఏళ్ల తివారీ దేశంలోని ప్రముఖ రాజకీయనాయకుల్లో ఒకరు. కాంగ్రెస్ సీనియర్ నేత. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులు కావడానికి ముందు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలంపాటు పని చేశారు. అట్లాంటి ప్రముఖ వ్యక్తి తన తండ్రి అంటూ రోహిత్ షేట్కర్ అనే యువకుడు కేసు పెట్టారు. ఉజ్వలా శర్మ అతని తల్లి. ఉజ్వల, తివారీ యవ్వనంలో ఉన్నపుడు కాంగ్రెస్పార్టీలో కలిసి పని చేశారు. అపుడు వారు సన్నిహితంగా మెలిగారు. ఆ విధంగా ఏర్పడిన సంబంధం వల్ల ఆయన తన జన్మకు కారణమయ్యారని రోహిత్ తెలిపారు. ఇది రుజువు చేయడానికి తివారీకి, తనకు జన్యు పరీక్షలు చేయించాలని కోరారు. దీంతో సమాధానం దాఖలు చేయాలని గత ఏడాది నవంబర్లో కోర్టు తివారీని ఆదేశించింది.
తివారీ తరఫున అడ్వొకేట్ రాజీవ్ నయ్యర్ ఈ కేసు వాదించారు.నిర్ణీత గడువు ముగిసిన కారణంగా రోహిత్ దాఖలు చేసిన కేసు చెల్లదని ఆయన చేసిన వాదనను జస్టిస్ ఎస్ఎస్ థిగ్రా అంగీకరించారు. చివరికి తివారీపై కేసు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.